Monday, 5 July 2010

విశాఖ కి ఇంత అన్యాయమా...

మిత్రులారా,

నిజానికి నా బ్లాగ్ విమర్శనా ప్రధానమే అయినా, విశాఖ పట్టణానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించ వలసిన సమయం వచ్చింది.

విశాఖ రాష్ట్రంలోనే రెండవ పెద్ద పట్టణం. పేరెన్నికగన్న ఓడరేవు. విహార స్థలము. ఇన్ని ఉన్నా, నానాటికీ, ఆ ఊరు తిన్నగా వెళ్ళే రైళ్ళ సంఖ్య తగ్గి పోవడం చాలా బాధాకరం.

దయచేసి, మీరంతా, ఈ కింద ఇచ్చిన లింక్స్ లోంచి మీ అభ్యంతరాన్ని ఆ యా ప్రముఖులకి తెలియచేయండి.

మీ మిత్రుడు,

సీతారామం

శ్రీమతి ప్రతిభా పాటిల్

మమతా Benarjee (రైల్వే మంత్రి)

దగ్గుబాటి పురందరేశ్వరి ( విశాఖ)

సబ్బం హరి (అనకాపల్లి)

ఉండవల్లి అరుణ్ కుమార్ ( రాజమండ్రి)

బొత్స ఝాన్సీ (విజయనగరం)

కిల్లి కృపారాణి (శ్రీకాకుళం)

Saturday, 26 June 2010

కూడలి

నా బ్లాగ్ కూడలి లో చేర్చబడింది...

సీతారాం

Thursday, 24 June 2010

గంధం వారి కథా గంధం..

ముందుగా ఈ పోస్టు ఒక్కసారైనా శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ గారు చూడాలని, చూచి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను..

90 దశకంలో రచన పత్రిక క్రమం తప్పకుండా చదువుతున్న రోజులలో గంధం వారి 'సెలవయింది' అన్న కథా సంపుటం జ్యేష్ఠ వారనుకుంటాను, ప్రచురించారు. పట్టుబట్టి, మా నాన్నగారి వెంట పడి ఆ పుస్తకం కొని, చదివి, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆ కథలన్నీ కంఠతా పట్టేశాను.

ఒక్కో కథా ఒక్కో ముత్యము అంటే అతిశయోక్తి కాదు. ఆ పుస్తకానికి ముందుమాట లో శ్రీ వాకాటి పాండురంగారావు గారు నిత్యం మన జీవితం లో మన ఇళ్ళలో సాధారణం గా ఉండే వస్తువ లనీ, మనుషులు, ఊర్ల పేర్ల తో సహా, సహజాతి సహజము గా వ్రాయగల కథకులు అని పరిచయం చేస్తారు గంధం వారిని.

ఇవాళ ఇది వ్రాయడానికి కారణం ఈ వారం నవ్య లో పడ్డ ' మగాళ్ళకేంతెలుసు ' అన్న కథ. అది మళ్ళీ కదిపిన జ్ఞాపకాల తేనెపట్టు.

ముందు పేర్కొన్న పుస్తకం లో, నాకు అన్నీ నచ్చినవే. మచ్చుకి ఒక కథ ని మీకు పరిచయం చేస్తాను..

దాక్షిణ్య లోభం అన్న కథ లో, పెద్ద చదువు చదువుతున్న మేన బావ పెళ్ళికి చిన్న ఉద్యోగస్తుడైన మురారి వెడతాడు. అసలు తనకిష్టం లేక పోయినా, మేన మామ మాట కాదనలేక వెళ్లి అవమాన పడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంతకీ అవమానానికి కారణం, మురారి పెళ్లి వేద మంత్రాలతో జరగకపోవడం, దాన్ని మేనమామ భార్య పెళ్లి గా గుర్తించకపోవడం.

పోతే, అంత ధార్మికం గా పెళ్లి చేసుకున్న విద్యాధిక, సంపన్న పెళ్లి కొడుకూ, పెట్టు పోతలలో మాట పట్టింపు కి పోయి ఆ పెళ్లి కూతురుని అక్కడే విడిచి ఇంటికి వెళ్ళిపోతాడు.

ఈ విషయాలన్నీ, వారిని అదుపుచేయ అశక్తుడైన మేనమామ మురారికి లేఖ రూపేణా తెలియబరచి, ఆఖరున, 'నాయనా మురారీ, ఇంత జరిగీ ఇంకా నీ మేనమామ బతికే ఉన్నాడు' అంటాడు.

ఇది స్థూలంగా దాక్షిణ్య లోభం కథ. మామూలుగా మన మధ్యలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరీ పెళ్లి కూతురుని వదిలెయ్యక పోయినా, పెట్టు పోతలు జరగలేదనీ, తక్కువ చేశారనీ, ఇలా ఎన్నో చికాకులు వింటూ ఉంటాము. అందరూ ఒక్కసారి, మనకు వేరే వాళ్ళు ఇస్తే తీసుకునే ఖర్మ ఏమిటి అని ఆలోచిస్తే, ఇంక ఎవరూ ఎవరినీ ఏదీ అడగరు కదా...

ఈ పోస్టు చదివిన వారు అందరూ నా మాట మన్నించి ఆ పుస్తకం చదివి వారి భావాలు నాతొ పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఆ పుస్తకము దొరకని వారు కనీసం పైన పేర్కొన్న కథ చదవండి..

భవదీయుడు

సీతారామం

Thursday, 17 June 2010

7 కోట్ల కధ

నాకు ఎందుకో సినిమా ని పేపర్ లో చదువుతున్నట్టు గా ఉంది. లేక పోతే ఒకానొక కారు లో డబ్బు దొరకడం, మహా మంత్రి గారి సైన్యపు మరకలు ఉండడం, దానికి దారిలో దొరికితే దాచామని ముసుగు, ఆహా హా

ఇంకో మలుపు, అసలుకి ఆడబ్బు మాది కాదు, వీరిది అని రెండు సాచ్చీకాలు, అవున్నిజమే, నాదగ్గర బళ్ళు కొనడానికే అంటూ మరో తోక సాక్షి.

వీటన్నిటికి మహా సైన్యాధికారి ముద్ర. ఒహోహో

ఎంత రక్తి కట్టింది కథ?

కే.జి. కందిపప్పు కూడా కార్డు మీద కొంటున్న, ఏదైనా వస్తువు విలువ లక్ష దాటితే చెక్కు వాడుతున్న ప్రజలు గొర్రెలు.. కాదనే గొర్రె (సారీ) ఎక్కడైనా ఉందా? కాబట్టి మనం పనిమాలా సినిమాలకి వెళ్లక్కరలేదు, ఇంటో కూచుని చదివి, ఆనక చెవులో తిరెట్టుగోచ్చు..

సీతారామం

P. S. ఏమీ రాయట్లేదేం అని జ్ఞాపకం చేసిన మాధురి కృష్ణ గారికి కృతఙ్ఞతలు.

Thursday, 29 April 2010

నేటి సినిమా...

చాలా కాలం గా నన్ను వేధిస్తున్న సమస్యలలో నేటి సినిమా నాణ్యత ఒకటి. ఎప్పుడు చూసినా, మా తాతలు నేతులు తాగారు లాగ, పాత సినిమాలన్నీ గొప్పవి, ఆ రోజుల్లో వాళ్ళు మహానుభావులు అన్న రీతిలో మూస మాటలు, నేడు పేరెన్నిక గన్న మహానుభావులనించి, కళారంగం లో బొడ్డూడని బాబుల దాక అందరూ ఒకటే వగచడం.

నేను చూసినంత వరకు, కథలో బలం, కొత్తదనం, వగైరా లు ఉన్నన్ని సినిమాలు, ఎప్పుడు రిలీజ్ అయినా, పది కాలాలపాటు నిలబడుతున్నాయి. నిన్న మొన్న వచ్చిన అతడు కాని, అంతకంటే తరవాత సినిమాలు కాని, అంతకుముందు వచ్చిన ఎన్నో గొప్ప సినిమాలు, ఇవాళ మళ్ళీ చూసినా మనసుని రంజింప చేస్తున్నాయి కదా. అటువంటప్పుడు, ఇవ్వాళ మంచి కళాకారులు లేరని ఎలా అనుకుంటాము. అదే తనికెళ్ళ భరణి గారు, శ్రీరాం గారు, ఇంకా నాలాంటి మందమతులకి పేర్లు గుర్తుకురాని ఎందఱో మహానుభావులు, అలాగే, పాటల రచన లో ఉద్దండులు, దర్శకులలో పేరెన్నిక గన్నవారు అందరూ వారే, ఇవ్వాళ రంగములో కాలూని నిలబడిన వారే.

అంచేత లోపము మనుషులలో లేదు. మరెక్కడో ఉంది. తెలుగు లో ఒక ముతక సామెత ఉంది, మొహమాటానికి పోతే కడుపు ఒచ్చిందని. అలాగ ఇవ్వాళ సినిమాల నాణ్యత దెబ్బ తినడానికి కారణాలు వేరే. నాదృష్టిలో ఒక రచన చేసే వ్యక్తి అనుభవాలు, ఆలోచనా సరళి, స్థాయి, భావ వ్యక్తీకరణ లో సౌమ్యత, ఇటువంటివి రచనలో ప్రస్ఫుటం గా కనపడతాయి. ఉదాహరణకి ఒక మనిషి చిత్రహింస పడ్డాడు అని వ్రాయడానికి, ఎలా, ఎన్ని రకాలు గా హింసించ బడ్డాడో వ్రాయడం అనేది, ఆ రచయిత(త్రి) మానసిక పరిపక్వతని చూపిస్తుంది. అలాగే, సినిమా లాంటి కళాత్మక మాధ్యమంలో కూడా, ఆయా వ్యక్తుల నైజం కనబడుతుంది. అటువంటి వారు తీసే సినిమాలు నిలబడకుండా పోవాలి అంటే, మిగిలిన వారు తీసే సినిమాలు చాలా రావాలి. అప్పుడు చెత్త తేలిపోతుంది. ఎనభై దశకం అంతకంటె ముందు, ఊక దంపుడు, అశ్లీలత ఉన్న సినిమాలు, కొన్ని హాళ్ళలో, కొండొకచో ఉదయపు ఆటల ప్రత్యేకతలో ప్రదర్శింప బడేవి. తప్పి జారి వేరే టైములో ఆ సినిమా ప్రదర్శింప బడినా, టిక్కట్లు అమ్ముడు పోయేవి కాదు. ఎప్పుడైనా చెరుకు తినడానికి చాలా ఉన్నప్పుడు చొప్ప ఎవరు నములుతారు? నమలటానికి అలవాటు పడిపోయినవారు ఏదో ఒకటి అని దొరికిన గడ్డి తింటారు. అంత మాత్రం చేత, మంచి వస్తువ ఉంటే కూడా అది మానేసి చెత్త వైపు వెళ్ళరు. అంచేత, పరిస్థితి మారాలి అంటే, మంచి సినిమాలు తియ్యగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ చెత్తని తగ్గించాలి. నేను పైన పేర్కొన్న వాళ్ళు కూడా రంగములో నిష్ణాతులు, ఊకదంపుడు గాళ్ళని అడ్డుకునికూడా నిభాయించ గల వారు (అని నా నమ్మకం) కనక, మొదటి అడుగు వాళ్ళు వేస్తె, మిగతా వారందరూ అటే నడవక తప్పదు.

ఒకవేళ ఎవరైనా కలిసి రాకపోతే కొమ్ములు వంచడానికి ప్రత్యేకం గా అసోసియేషన్ ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు కదా!!

అప్పుడు మన భావి తరం కూడా, మా చిన్నప్పుడు అని చెప్పుకునే అవకాశం వస్తుంది.

భవదీయుడు

సీతారామం

Thursday, 8 April 2010

కుహనా హేతువాదమా?

భవానీ శంకర్ గారు ఆంధ్ర భూమి లో వ్రాసిన 'శాస్త్రీయ దృక్పథం కాదు... కుహనా హేతువాదం' అన్న వ్యాసము దీనికి ప్రేరణ.

స్థూలము గా భవానీ శంకర్ గారి వాదన ఏమిటి అంటే, ఒకరు ఇద్దరు దొంగ బాబా లు బయట పడినంత అందరినీ అదే గాట కట్ట కూడదు అని. శాస్త్రీయ విధానాలకు అంతు పట్టనివి ఎన్నో ఉన్నాయి అని, సైన్సు వల్ల జరిగే నష్టాలను హేతువాదులు మరుగు పరచకూడదని, పూజలు, మంత్రాలు, జ్యోతిష్యము వంటి వాటి వల్ల జరిగే లాభాలను ఒప్పుకోవాలని అన్నారు.

వీటిలో, పూజలు, మంత్రాలు, జ్యోతిష్యము వంటి వాటిని పూర్తి నిర్దేశిత విధానాలలో చూస్తే వాటి వల్ల లాభాలు ఉన్నాయేమో గాని, మిడి మిడి జ్ఞానము తో గుడ్డి గా నమ్మడము హేతువు కి అందదు కనక, వాటి వల్ల ప్రయోజనాలు స్వల్పము, స్వార్థపరులకు లాభ దాయకము. అందుచేత, పూర్తిగా నిర్ధారణ అయితే తప్ప, కుహనా జ్ఞానుల అండ కోరుకోవడం వృథా.

ఆ వ్యాసము లో ఉదాహరించిన కోకురో ఉదంతము నాకు తెలియదు. కానీ, ఆయన చెప్పిన దానిని యథాతథము గా ఒప్పుకుంటాను. అట్టి బౌద్ధభిక్షుకులను జనబాహుళ్యము వెదికి పాదములంటి నమస్కరించ వలసినదే. కాని, వారే ముందుకు వచ్చి మావల్లే ఇదంతా అని చాటింపు వేసుకుని పాద పూజలు ఆశిస్తే? అది వారికి యెంత గౌరవము? ఎన్నడూ నిజమైన సాధుజనులు వారంత వారై ప్రాప్తము లేనట్టి వారికి కనిపించరు. కనపడే ధూర్తులంతా పగటి వేషగాళ్ళు. ఇటువంటి వారిని ప్రోత్సహించడము, నిప్పుని చేతితో పట్టుకోవడము లాంటిది. భగవదారాధన మానివేసి, వ్యక్తి ఆరాధన లో జనులు మునిగి పోవడము ఎంత వరకు శ్రేయస్కరము?

కుహనా హేతువాదాన్ని ఖండించిన కలము కుహనా స్వాములను ఎందుకు ఖండించదు? కృష్ణ శాస్త్రి గారు వ్రాసినట్లు, ఎరిగిన వారికి యెదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు, అట్టి భగవంతుని సన్నిధికి చేర్చడానికి బోయీల అవసరం ఏమిటి?

నీలతోయద మధ్యస్థా ద్యిద్యుల్లెఖేవ భాస్వరా
నీవార శూక వత్తన్వీ పీతాభాస్వత్యణూపమా అని వేదోక్తి.

అట్టి జ్యోతి మధ్య నున్న భగవంతుడు ప్రాప్తము ఉన్నవారికి తనకు తానై కనబడతాడు, అంతే కాని తుచ్ఛ మానవ సహాయము కోరడు.

అశాస్త్రీయాన్ని ఖండించండి. భారతీయ సంస్కృతిని కాపాడండి, జ్యోతిష శాస్త్ర విలువని పెంచండి, పూజల మహిమ చాటండి. అలాగే, కుహనా వేషగాళ్ళ భరతం పట్టండి. వారి మాటల గారడీ నమ్మకండి. మాజిక్ చూడాలంటె, పి.సి సోర్కార్ లాంటి వాళ్ళ షో చూడండి. అంతే కాని అన్య పురుష పాదాక్రాంతులు కాకండి, వారికి డబ్బు, జీవితము వెల పోయకండి

భవదీయుడు,

సీతారామం