Thursday 24 June 2010

గంధం వారి కథా గంధం..

ముందుగా ఈ పోస్టు ఒక్కసారైనా శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ గారు చూడాలని, చూచి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను..

90 దశకంలో రచన పత్రిక క్రమం తప్పకుండా చదువుతున్న రోజులలో గంధం వారి 'సెలవయింది' అన్న కథా సంపుటం జ్యేష్ఠ వారనుకుంటాను, ప్రచురించారు. పట్టుబట్టి, మా నాన్నగారి వెంట పడి ఆ పుస్తకం కొని, చదివి, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆ కథలన్నీ కంఠతా పట్టేశాను.

ఒక్కో కథా ఒక్కో ముత్యము అంటే అతిశయోక్తి కాదు. ఆ పుస్తకానికి ముందుమాట లో శ్రీ వాకాటి పాండురంగారావు గారు నిత్యం మన జీవితం లో మన ఇళ్ళలో సాధారణం గా ఉండే వస్తువ లనీ, మనుషులు, ఊర్ల పేర్ల తో సహా, సహజాతి సహజము గా వ్రాయగల కథకులు అని పరిచయం చేస్తారు గంధం వారిని.

ఇవాళ ఇది వ్రాయడానికి కారణం ఈ వారం నవ్య లో పడ్డ ' మగాళ్ళకేంతెలుసు ' అన్న కథ. అది మళ్ళీ కదిపిన జ్ఞాపకాల తేనెపట్టు.

ముందు పేర్కొన్న పుస్తకం లో, నాకు అన్నీ నచ్చినవే. మచ్చుకి ఒక కథ ని మీకు పరిచయం చేస్తాను..

దాక్షిణ్య లోభం అన్న కథ లో, పెద్ద చదువు చదువుతున్న మేన బావ పెళ్ళికి చిన్న ఉద్యోగస్తుడైన మురారి వెడతాడు. అసలు తనకిష్టం లేక పోయినా, మేన మామ మాట కాదనలేక వెళ్లి అవమాన పడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంతకీ అవమానానికి కారణం, మురారి పెళ్లి వేద మంత్రాలతో జరగకపోవడం, దాన్ని మేనమామ భార్య పెళ్లి గా గుర్తించకపోవడం.

పోతే, అంత ధార్మికం గా పెళ్లి చేసుకున్న విద్యాధిక, సంపన్న పెళ్లి కొడుకూ, పెట్టు పోతలలో మాట పట్టింపు కి పోయి ఆ పెళ్లి కూతురుని అక్కడే విడిచి ఇంటికి వెళ్ళిపోతాడు.

ఈ విషయాలన్నీ, వారిని అదుపుచేయ అశక్తుడైన మేనమామ మురారికి లేఖ రూపేణా తెలియబరచి, ఆఖరున, 'నాయనా మురారీ, ఇంత జరిగీ ఇంకా నీ మేనమామ బతికే ఉన్నాడు' అంటాడు.

ఇది స్థూలంగా దాక్షిణ్య లోభం కథ. మామూలుగా మన మధ్యలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరీ పెళ్లి కూతురుని వదిలెయ్యక పోయినా, పెట్టు పోతలు జరగలేదనీ, తక్కువ చేశారనీ, ఇలా ఎన్నో చికాకులు వింటూ ఉంటాము. అందరూ ఒక్కసారి, మనకు వేరే వాళ్ళు ఇస్తే తీసుకునే ఖర్మ ఏమిటి అని ఆలోచిస్తే, ఇంక ఎవరూ ఎవరినీ ఏదీ అడగరు కదా...

ఈ పోస్టు చదివిన వారు అందరూ నా మాట మన్నించి ఆ పుస్తకం చదివి వారి భావాలు నాతొ పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఆ పుస్తకము దొరకని వారు కనీసం పైన పేర్కొన్న కథ చదవండి..

భవదీయుడు

సీతారామం

No comments:

Post a Comment