Sunday 28 March 2010

విలువలు..

ఈ వారం కథలు ఏవి అంత గొప్ప గా లేవు. అంచేత, మనసు ఎందుకో న్యూస్ ని అనలైజ్ చేసే వైపు పరుగులు తీసింది. నిన్నో మొన్నో ఆంధ్రభూమి లో ఒక వార్త. 'వచ్చేదెవరు, పోయేదెవరు' అని. ప్రతిపాదిత (లేక ఊహాజనిత) మంత్రివర్గ మార్పులు.. అన్నది అంశం.

బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మంత్రులు కావడానికి అర్హత కులమేనా? భారత దేశం ఇంత కంటే బాగా ఆలోచించ లేదా? అని చాలా బాధ అనిపించింది. అక్కడ మొదలైన విచికిత్స పోయి పోయి అసలు ఎందువల్ల ఇలా అనేచోట ఆగింది.

మనుషుల ఆలోచనా సరళి లో మార్పే దీనికి కారణం అని తీర్మానించుకున్నాను. ఎలా అంటే..

50 ఏళ్ళ క్రితం, 80 ఏళ్ళ క్రితం, మనం ఇంత దారుణం గా ఉన్నామా? ఇంకా దిగాజారిపోతున్నామా? ఆ కాలపు సినిమాలు, కథలు, పత్రికలు, మహానుభావుల వ్యాసాలూ అన్నీ కూడా ఇంత దారుణం గా లేవు అని ఋజువు చేస్తున్నాయి. శ్రీ శ్రీ లాంటి కవులు 'అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు...' అని ప్రశ్నించినా, అప్పటికీ ఇప్పటికీ ఇంకా నీచము గా అయిపొయింది మన వ్యవస్థ.

చెడ్డ పని చెయ్యడమె కాక, పట్టుబడితే సిగ్గు కూడా పడడం మానేశారు ప్రజలు. అందులోంచే కొంత మంది రాజకీయ నాయకులు అయ్యారు కనక వేరే ఆశలు పెట్టుకోవడం అనవసరం.

ఇవాళ ఎవరైనా ప్రిన్సిపుల్స్ తోటి బతికితే వాళ్ళు చాదస్తులు అవుతున్నారు తప్ప గొర్రెల మంద మాత్రం నేర్చుకోవటల్లేదు. ఈ హేళన భరించలేని వాళ్ళు, లేదా ఇతరత్రా కారణాలు కనపడ్డ వారు, జ్ఞానం తెచ్చుకుని గొర్రెల మందలో కలిసిపోతున్నారు. గురువుని పూజింపుము, అని చిన్నప్పుడు చదువుకున్నాం. కనీసం మా ఇంట్లో, మాస్టారు చెప్పారు అనడమే తప్ప, ఏక వచన ప్రయోగం నాకు తెలిసి చెయ్యలేదు. అథవా, ఎవడైనా నా బోటి విప్లవ కారుడు చేసినా తోలు వలవబడేది. ఇవాళ, పిల్లలకి టీచర్లను ఏకవచన ప్రయోగం చెయ్యకూడదు అంటే జూ లో జంతువుని చూసినట్లు చూస్తున్నారు, అప్పుడు అలా చదువుకున్న వాళ్ళు కూడా. ఇలాంటివి కొన్ని వందల విషయాలు మనం రోజూ చూస్తున్నాం, కాని పట్టించుకోం. ఎందుకంటే, అంతే..

ఇంకో ఉదాహరణ. నాన్నో, అమ్మో, ఏదైనా చెపితే వినని చాలా మంది నవ తరం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తాత, నాయనమ్మ / అమ్మమ్మ ల నించి ఏదో నేర్చుకోలేక పోతున్నారని అమెరికా లోను, ఇంకా ఇతర ప్రవాస దేశాలలోను అంగలార్చడం నేను కళ్ళారా చూసి తరించాను.

ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోం, పట్టించుకునే ఖాళీ మనకు లేదు. కాని పేపరులో చూసి మాత్రం విచారిస్తాం, దేశం సర్వ నాశనం అయిపోయిందని ఉపన్యాసాలిస్తాం.

అందుచేత, మహానుభావులు చెప్పినట్లు, మార్పు మనలో మొదలవుతుంది. (ఇప్పుడూ అవుతోంది, ముందు చెప్పినట్టు గొర్రెల మంద వైపు) అయ్యా, అమ్మా, మీరు మారండి. విలువలు, ప్రిన్సిపుల్స్ పిల్లలకు అలవాటు చెయ్యండి. బహుశా భవిష్య నాయకగణమయినా ఇప్పటి తరం కంటే మంచి వాళ్ళు వస్తారని ఆశించవచ్చు. లేకపోతే, ఇలా కుక్కమూతి పిందెల నాయకత్వంలో దేశం భ్రస్టుపట్టి పోతుంది, విసుగెత్తిన మన పిల్లల తరాలు, స్వాతంత్ర్యాన్నే ప్రశ్నించే ప్రమాదం ఉంది.

Sunday 21 March 2010

వీకెండ్ కథలు

ఈ ఆదివారం (21/03/2010) చదివిన కథలు:
ఈనాడు - పునాది రాళ్ళు
ముందుగా కథ కంటే, ఇతివృత్తం నన్ను ఇబ్బంది పెట్టింది. మార్ఫింగ్ లాంటి పనులు జరిగే అవకాశం ఉన్నా అవి ఎంతో మందికి తెలియదు ఇంకా. అలాంటి కథావస్తువు తీసుకుని కథ వ్రాసి ఈనాడు లాంటి పెద్ద పత్రిక లో ప్రచురిస్తే, ఇప్పుడు అది తెలియనివారికి కూడా తెలుస్తుంది. అంతే తప్ప ఈ కథ వల్ల వేరే ఉపయోగం నాకేమీ కనపడలేదు. దినపత్రిక లాంటి శక్తివంతమైన మాధ్యమం లో ఇలాంటి కథలు, దానికి తగ్గ బొమ్మలు పూర్తి గా అనవసరం.
కథని విశ్లేషిస్తే, రచయిత స్త్రీ స్వాభిమానాన్ని సమర్ధించారు, బాగుంది. కాని ఎన్నుకున్న దారి చాలా పొరపాటు, నిజ జీవితానికి చాలా దూరంగా ఉన్న పరిష్కారం. నా దృష్టి లో ఇంకా చాలా చదివి అప్పుడు వ్రాయడం మొదలు పెడితే, కథ లో ఇతివృత్తము యొక్క ప్రాధాన్యత తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఇంకా మంచి రచయిత కాగలరు.

అంధ్ర భూమి - జీవన స్రవంతి
జీవన స్రవంతి కథ లో ఏదో చెయ్యాలనే కోరిక నిద్రాణంగా ఉన్న ఎందరో గృహిణులు కనబడతారు. కాకపోతే అందరి అప్ప్రోచ్ ఒకేలా ఉండదు. కాని రచయిత్రి చూపిన కోణం బావుంది. కాకపొతే, పిట్ట కథ లాంటి దానమ్మ, ఆమె కు సంబంధించిన అన్ని సన్నివేశాలు వృధా. అది అంతా తీసేస్తే, కథ చిన్నది అయినా, ఫోకస్డ్ గా ఉండేది. ఇంకా పరిణితి చూపిస్తే, మంచి రచనలు చెయ్యగలరు అని నా నమ్మకం.

అంధ్ర జ్యోతి - పరబ్రెహ్మం
ఈ కథ ని ఒక్క సారి చదివి ఒదిలేస్తే లాభం లేదు. ప్రతీ రోజు, ప్రతీ సారి, రైతుల కి జరిగే అన్యాయాలని చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోదగ్గది. అప్పుడే ఈ కథ కి సార్థకత. అంత సామాజిక స్పృహ ఉన్న కథ ఇది. కోడిగుడ్డు కి ఈకలు పీకినట్టు ఈ కథ లో పాత్రల న్యాయాలు చూడకుండా సారాంశాన్ని తీసుకుంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ తెలుసుకుంటారు. ఆకొన్న వారికి ఒక ముద్ద అన్నం పెడతారు. చాల మంచి ఇతివృత్తం. బాధించినా బాగున్న కథ ఇది.


ఇది నా తొలి అడుగు

పెద్దలకు నమస్కారములు,

నేను కొన్ని పుస్తకాలు చదివాను (నవలలు, కథలు, పోస్టులు, అన్ని రకాలుగా ప్రింట్ అయినవి). కొన్ని సార్లు నా భావాలను వ్యక్తీకరించాను బ్లాగులలో పోస్టింగ్ ల ద్వారా. మిత్రులు కొంతమంది రెచ్చగొట్టడం తో రెచ్చబడి (ఈ పద ప్రయోగం నా స్వంతం కాదు సుమా) ఈ ప్రయత్నం చేస్తున్నాను.

ఇప్పుడు ఒక బ్లాగ్ తయారు చేస్తున్నాను, నా విమర్శలను ఒక చోట ఉంచడానికి. అసలు విమర్శ అవసరం ఏమిటి? రచయిత దృక్కోణం నుంచి కాక మరో కొత్త కోణాన్ని చూడడమే విమర్శ తొలి లక్ష్యం. ఈ రంగంలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. వారి అడుగు జాడల లో కొన్ని అడుగులైనా వెయ్యలేక పోతానా అనే నమ్మకం తో ఈ బ్లాగు ని ప్రారంభించాను.

అందరి సలహాలు, సంప్రదింపుల కోసం ఎదురుచూస్తూ

బుధజన విధేయుడు

సీతారామం