ఈ వారం కథలు ఏవి అంత గొప్ప గా లేవు. అంచేత, మనసు ఎందుకో న్యూస్ ని అనలైజ్ చేసే వైపు పరుగులు తీసింది. నిన్నో మొన్నో ఆంధ్రభూమి లో ఒక వార్త. 'వచ్చేదెవరు, పోయేదెవరు' అని. ప్రతిపాదిత (లేక ఊహాజనిత) మంత్రివర్గ మార్పులు.. అన్నది అంశం.
బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మంత్రులు కావడానికి అర్హత కులమేనా? భారత దేశం ఇంత కంటే బాగా ఆలోచించ లేదా? అని చాలా బాధ అనిపించింది. అక్కడ మొదలైన విచికిత్స పోయి పోయి అసలు ఎందువల్ల ఇలా అనేచోట ఆగింది.
మనుషుల ఆలోచనా సరళి లో మార్పే దీనికి కారణం అని తీర్మానించుకున్నాను. ఎలా అంటే..
50 ఏళ్ళ క్రితం, 80 ఏళ్ళ క్రితం, మనం ఇంత దారుణం గా ఉన్నామా? ఇంకా దిగాజారిపోతున్నామా? ఆ కాలపు సినిమాలు, కథలు, పత్రికలు, మహానుభావుల వ్యాసాలూ అన్నీ కూడా ఇంత దారుణం గా లేవు అని ఋజువు చేస్తున్నాయి. శ్రీ శ్రీ లాంటి కవులు 'అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు...' అని ప్రశ్నించినా, అప్పటికీ ఇప్పటికీ ఇంకా నీచము గా అయిపొయింది మన వ్యవస్థ.
చెడ్డ పని చెయ్యడమె కాక, పట్టుబడితే సిగ్గు కూడా పడడం మానేశారు ప్రజలు. అందులోంచే కొంత మంది రాజకీయ నాయకులు అయ్యారు కనక వేరే ఆశలు పెట్టుకోవడం అనవసరం.
ఇవాళ ఎవరైనా ప్రిన్సిపుల్స్ తోటి బతికితే వాళ్ళు చాదస్తులు అవుతున్నారు తప్ప గొర్రెల మంద మాత్రం నేర్చుకోవటల్లేదు. ఈ హేళన భరించలేని వాళ్ళు, లేదా ఇతరత్రా కారణాలు కనపడ్డ వారు, జ్ఞానం తెచ్చుకుని గొర్రెల మందలో కలిసిపోతున్నారు. గురువుని పూజింపుము, అని చిన్నప్పుడు చదువుకున్నాం. కనీసం మా ఇంట్లో, మాస్టారు చెప్పారు అనడమే తప్ప, ఏక వచన ప్రయోగం నాకు తెలిసి చెయ్యలేదు. అథవా, ఎవడైనా నా బోటి విప్లవ కారుడు చేసినా తోలు వలవబడేది. ఇవాళ, పిల్లలకి టీచర్లను ఏకవచన ప్రయోగం చెయ్యకూడదు అంటే జూ లో జంతువుని చూసినట్లు చూస్తున్నారు, అప్పుడు అలా చదువుకున్న వాళ్ళు కూడా. ఇలాంటివి కొన్ని వందల విషయాలు మనం రోజూ చూస్తున్నాం, కాని పట్టించుకోం. ఎందుకంటే, అంతే..
ఇంకో ఉదాహరణ. నాన్నో, అమ్మో, ఏదైనా చెపితే వినని చాలా మంది నవ తరం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తాత, నాయనమ్మ / అమ్మమ్మ ల నించి ఏదో నేర్చుకోలేక పోతున్నారని అమెరికా లోను, ఇంకా ఇతర ప్రవాస దేశాలలోను అంగలార్చడం నేను కళ్ళారా చూసి తరించాను.
ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోం, పట్టించుకునే ఖాళీ మనకు లేదు. కాని పేపరులో చూసి మాత్రం విచారిస్తాం, దేశం సర్వ నాశనం అయిపోయిందని ఉపన్యాసాలిస్తాం.
అందుచేత, మహానుభావులు చెప్పినట్లు, మార్పు మనలో మొదలవుతుంది. (ఇప్పుడూ అవుతోంది, ముందు చెప్పినట్టు గొర్రెల మంద వైపు) అయ్యా, అమ్మా, మీరు మారండి. విలువలు, ప్రిన్సిపుల్స్ పిల్లలకు అలవాటు చెయ్యండి. బహుశా భవిష్య నాయకగణమయినా ఇప్పటి తరం కంటే మంచి వాళ్ళు వస్తారని ఆశించవచ్చు. లేకపోతే, ఇలా కుక్కమూతి పిందెల నాయకత్వంలో దేశం భ్రస్టుపట్టి పోతుంది, విసుగెత్తిన మన పిల్లల తరాలు, స్వాతంత్ర్యాన్నే ప్రశ్నించే ప్రమాదం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
Pls give your mail ID, if you have no objection.
ReplyDeleteramsaiprav@yahoo.com
ReplyDelete